komati Reddy Venkata Reddy: ఏపీ సీఎం జగన్ పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి పొగడ్తల వర్షం

  • జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు
  • కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు
  • కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయొద్దు
  • మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారని తెలంగాణ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.

 కోమటిరెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏపీ సీఎం జగన్ ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నారు. తెలంగాణలో రైతు రుణమాఫీ ఎక్కడ? నిరుద్యోగ భృతి ఏది? రైతు బంధు ఎక్కడికి పోయింది? కేసీఆర్ కు పేద, బడుగు బలహీన వర్గాలంటే పట్టింపే లేదు. కేసీఆర్ కు మానవత్వం లేదు’ అని అన్నారు.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయవద్దని సూచించారు. ప్రశ్నించే గొంతుక ఉంటేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో ఓఆర్ఆర్, ఐటీ కంపెనీలు వచ్చాయన్నారు.

More Telugu News