Hyderabad: పాఠశాలలో మందుబాబుల న్యూ ఇయర్ పార్టీ... ఉదయం వచ్చి షాక్ అయిన విద్యార్థులు!

  • ఫిలింనగర్ ప్రభుత్వ పాఠశాలలో మందుబాబుల వీరంగం 
  • నూతన సంవత్సరం రోజు రాత్రి హంగామా
  • మద్యం బాటిళ్లు, ఆహార వ్యర్థాలు ఎక్కడివక్కడే

ప్రభుత్వ పాఠశాల...అక్కడ మనల్ని అడిగేదెవరని భావించిన కొందరు మందు బాబులు విద్యాలయాన్ని బార్ గా మార్చేయడంతో ఈరోజు ఉదయం వెళ్లిన విద్యార్థులు షాక్ అయ్యారు. ఎక్కడ చూసినా మద్యం సీసాలు, ఆహార పదార్థాల వ్యర్థాలు కనిపించడంతో కంగుతిన్నారు. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ ఫిలింనగర్‌లో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో మొత్తం 1600 మంది విద్యార్థులు చదువుతున్నారు. మంగళవారం యథావిధిగా పాఠశాల జరిగింది.

నూతన సంవత్సరం కావడంతో బుధవారం పాఠశాలకు సెలవిచ్చారు. ఇంకేం అడిగే వారు ఉండరు... బెంచీలు, కుర్చీల కోసం వెతుక్కోనక్కర్లేదని భావించిన కొందరు మందుబాబులు మద్యం బాటిళ్లు, తినే పదార్థాలతో చేరుకున్నారు. పీకలదాకా తాగి ఖాళీ బాటిళ్లు, వ్యర్థాలు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

గురువారం ఉదయం ఎప్పటిలా పాఠశాలకు వచ్చిన విద్యార్థులు అక్కడి పరిస్థితి చూసి కంగుతిన్నారు. విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లారు. విషయం తెలిసి సమీపంలోని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాలకు చేరుకున్నారు.

మందుబాబుల ఆగడాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు వారిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని, దీనివల్ల మరెవరూ ఇటువంటి పని చేయరని డిమాండ్ చేశారు.

More Telugu News