Vijayanagaram District: ఆఖరి మాటే శాశ్వతమైంది...రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి!

  • నూతన సంవత్సర వేడుకల్లో సంబరాలు 
  • ఇదే చివరి మెసేజ్ అంటూ స్నేహితులకు సెల్ఫీ వీడియో పోస్టింగ్ 
  • ఆ తర్వాత కొన్ని గంటలకే మృత్యువాత

నూతన సంవత్సర వేడుకల్లో నిండా మునిగిన ఆ యువకుడు అప్రయత్నంగా అన్న మాటలే నిజమై అతని కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చాయి. 'ఈ ఏడాదికి ఇదే నా చివరి మెసేజ్' అంటూ స్నేహితులకు సెల్ఫీ వీడియో పోస్టింగ్ చేసిన కాసేపటికే రోడ్డు ప్రమాదంలో అతను చనిపోవడం స్థానికులను షాక్ కు గురిచేసింది.

విజయనగరం జిల్లాలో జరిగిన ఈ విషాదకర ఘటన వివరాల్లోకి వెళితే...బొండపల్లి మండలం ఎం.కొత్తవలసకు చెందిన ఎం .వినోద్, పెదమజ్జిపాలెంకు చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి మంగళవారం రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో గడిపాడు. అర్ధరాత్రి దాటే వరకు స్నేహితులు ఎంజాయ్ చేశారు.

ఈ సందర్భంగా వినోద్ తన స్నేహితులకు 'ఒరేయ్ బావా...చూడు, ఇదే నా చివరి సెల్ఫీ. ఈ సంవత్సరానికి ఇదే ఆఖరు రోజు కదా. అందుకే ఇదే చివరి సెల్ఫీ' అంటూ వీడియో తీసి పోస్టు చేశాడు. ఈ పోస్టింగ్ చేసిన కాసేపటి తర్వాత ముగ్గురూ ద్విచక్రవాహనంపై బయలుదేరారు.

అర్ధరాత్రి తర్వాత బొండపల్లి మండలం యడ్లపాలెం సమీపంలో వేగంగా వెళుతున్న వీరి బైక్ ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వినోద్ తుళ్లి పక్కనే ఉన్న చెరువులో పడిపోవడంతో మునిగి మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు స్నేహితులు గాయాలతో బయటపడ్డారు.

More Telugu News