Vizag: జగన్ సార్... సూసైడ్ చేసుకుంటా..: కలకలం రేపిన వైజాగ్ యువకుడి వాయిస్ మెసేజ్!

  • విశాఖలో మీ సేవా కేంద్రాన్ని నడుపుతున్న శ్రీహరి
  • గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేవలందించేందుకు ప్రభుత్వం నిర్ణయం
  • తన ఉపాధి పోయిందని శ్రీహరి మనస్తాపం

గ్రామ సచివాలయాల్లోనే మీ సేవా కేంద్రాల ద్వారా అందే అన్ని సేవలనూ అందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించడంతో, తన ఉపాధి పోతుందన్న ఆందోళనలో పడ్డ ఓ దివ్యాంగుడు, జగన్ ను ఉద్దేశించి, ఆత్మహత్య చేసుకుంటానని వాయిస్ మెసేజ్ ని పెట్టడంతో విశాఖపట్నం, మధురవాడ ప్రాంతంలో కలకలం రేగింది.

 వివరాల్లోకి వెళితే, ఇక్కడి వాంబే కాలనీలో శ్రీహరి అనే దివ్యాంగుడికి, గత ప్రభుత్వం మీ సేవా కేంద్రాన్ని మంజూరు చేసింది. అతను దీన్ని నడుపుకుంటూ జీవనాన్ని గడుపుతున్నాడు. జనవరి ఒకటి నుంచి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా అన్ని సేవలనూ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి మీసేవా కేంద్రాల నిర్వాహకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమను పట్టించుకోలేదని వారు నిరసనలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలో శ్రీహరి, ఓ వాయిస్ మెసేజ్ ని తన మిత్రులకు పంపించాడు. ఆరు నెలలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. ప్రభుత్వం వెంటనే భరోసా ఇవ్వాలని, లేకుంటే, తన మీసేవా కేంద్రంలోనే సూసైడ్ చేసుకుంటానని చెప్పాడు. ఈ మెసేజ్ ని విన్న శ్రీహరి స్నేహితులు పరుగు పరుగున వాంబే కాలనీకి వచ్చి, మీ సేవా సెంటర్ లోనే తలుపేసుకుని ఉన్న అతన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

More Telugu News