RK: మంగళగిరి జనాలు కావాలా? జగన్ కావాలా?... తేల్చుకునే సమయం వచ్చింది: టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్

  • ఆర్కే ఎక్కడ దాక్కున్నారు?
  • రాజధాని రైతులకు కావాల్సింది ప్లాట్లు కాదు
  • ఆర్కే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు

రాజధాని రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఎక్కడ దాక్కున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. ఓట్లేసిన ప్రజలు రోడ్ల మీదకు వస్తే... వారితో కనీసం మాట్లాడటం కూడా లేదని విమర్శించారు. భూములను త్యాగం చేసిన రైతులకు ఇవ్వాల్సింది ప్లాట్లు కాదని... ప్రజా రాజధానిని ఇవ్వాలని అన్నారు. రాజధానిని మరోచోటుకి తరలించి ప్లాట్లు ఇస్తే... రైతులు ఏం చేసుకుంటారని ప్రశ్నించారు.

రాజధాని ప్రాంత రైతులకు స్పష్టతను ఇవ్వకుండా... ముఖ్యమంత్రి జగన్ కు మద్దతుగా ఆర్కే మాట్లాడుతున్నారని అనగాని మండిపడ్డారు. మంగళగిరి ప్రజలు కావాలో? జగన్ కావాలో? ఆర్కే తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. రాజధాని ప్రాంత రైతులకు సంఘీభావంగా ఆర్కే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తే... ఆర్కే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని చెప్పారు.

More Telugu News