Crime News: కాల్ మనీ రాకెట్... వేధింపులు భరించలేక యువకుడి ఆత్మహత్యా యత్నం!

  • చనిపోతున్నానని భార్యకు ఫోన్లో సమాచారం 
  • అనంతరం పశ్చిమ డెల్టా కాలువలోకి దూకి గల్లంతు
  • వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారంటూ వీడియో

నాలుగు లక్షలు అప్పు తీసుకున్న పాపానికి 16 లక్షలు వడ్డీగా చెల్లించాలంటూ నిత్యం వేధిస్తున్న వ్యాపారుల తీరుతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు కాలువలోకి దూకి ఆత్మహత్యా యత్నం చేశాడు. తాను చనిపోతున్నానంటూ భార్యకు ఫోన్ చేయడమేకాక, తన బాధను సెల్ఫీ వీడియో తీసి పోస్టు చేయడంతో భర్త జాడ తెలియక భార్య ఆందోళన చెందుతోంది. పోలీసుల కథనం మేరకు...విజయవాడ పడమటకు చెందిన వేములపూడి ప్రేమ్ కుమార్ (30) ఈనెల 28వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.

'రంగారావు అనే వ్యక్తి వద్ద నాలుగు లక్షలు అప్పు తీసుకున్నాను. వడ్డీ 16 లక్షలు అయ్యిందని, మొత్తం తక్షణం చెల్లించాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. అతని వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నాను' అంటూ వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. అనంతరం తాడేపల్లిలోని సీతానగరం వద్ద పశ్చిమడెల్టా కాలువలోకి దూకినట్టు భావిస్తున్నారు.

ఈ వీడియో చూసిన అతని భార్య దిషితాకృష్ణ 'స్పందన' కార్యక్రమంలో పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయమని కోరింది. ఈలోగా పడమట కాలువలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, కాలువ వద్ద లభించిన ద్విచక్ర వాహనం ఆధారంగా పడమట పోలీసులకు తాడేపల్లి పోలీసులు సమాచారం ఇచ్చారు.

 దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కాలువలో గాలింపు చర్యలు చేపట్టినా ఆదివారం వరకు మృతదేహం లభించలేదు. ప్రేమ్ కుమార్ ఏమైందీ తెలియరాలేదు. వడ్డీ వ్యాపారి బెదిరింపుల వల్ల తన భర్త ఆత్మహత్యా యత్నం చేశాడని, అతను తనను కూడా బెదిరిస్తున్నాడని బాధితుడి భార్య చెబుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News