Red Sand Boa: ఈ పాము ధర రూ. 1.25 కోట్లు... అమ్ముతుంటే పట్టేసుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు!

  • ఔషధాలు, కాస్మెటిక్స్ తయారీకి వినియోగం
  • దగ్గరుంచుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందన్న నమ్మకం
  • అంతర్జాతీయ మార్కెట్లో రెడ్ శాండ్ బొవాకు ఎనలేని డిమాండ్

ఓ అత్యంత విలువైన, అరుదైన పామును మధ్యప్రదేశ్ పోలీసులు రక్షించారు. దీని పేరు రెడ్ శాండ్ బోవా స్నేక్. దీని ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ. 1.25 కోట్లు. దీన్ని పట్టుకున్న ఐదుగురు, నర్సింఘర్ ప్రాంతంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఈ పాము విషపూరితం కాదని, దీనిని మందులు, కాస్మెటిక్స్ తయారీలో విరివిగా వాడుతారని, చేతబడులు చేసేందుకు ఉపయోగిస్తారని, దీనికి ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉందని తెలిపారు. ఈ పాము దగ్గరుంటే మంచి జరుగుతుందని, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని నమ్ముతుంటారని తెలిపారు.

స్థానిక బస్టాండ్ ప్రాంతంలో పాము విక్రయంపై ఫోన్ లో మాట్లాడుకుంటుండగా, తమ ఇన్ఫార్మర్ విని, సమాచారం ఇచ్చాడని, వెంటనే దాడి జరిపి నిందితులను పట్టుకున్నామని, పవన్ నాగర్, శ్యామ్ గుర్జార్ లతో పాటు ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. సెహోర్ జిల్లాలో పాము దొరికిందని వారు తమ విచారణలో చెప్పినట్టు పోలీసులు తెలిపారు. వన్యప్రాణ రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News