Maharashtra: యువతిని కిడ్నాప్ చేసి ఏడాదిన్నరగా సామూహిక అత్యాచారం!

  • మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలోని వాసాయ్ తాలూకాలో దారుణం  
  • ఈ క్రమంలో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
  • తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి ఘటన

ఓ యువతిని కిడ్నాప్ చేసిన 11 మంది దుండగులు ఆమెపై గత ఏడాదిన్నరగా అత్యాచారం జరిపిన ఘటన తాజాగా వెలుగుచూసింది. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలోని వాసాయ్ తాలూకాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఒక పక్క నిర్భయ, దిశ వంటి చట్టాలు చేస్తోన్నప్పటికీ.. ఇలాంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఆ వివరాలలోకి వెళితే, 21 ఏళ్ల యువతిని బలవంతంగా లొంగదీసుకున్న ఓ వ్యక్తి.. ఆమెపై తొలుత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరికొందరితో కలిసి ఆమెను కిడ్నాప్ చేసి ఓ చోట నిర్బంధించి మళ్లీ ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. అతడితో పాటు మిగతా వాళ్లు కూడా ఆమెను శారీరకంగా హింసించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  

ఈ క్రమంలో ఆ యువతి  బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయినా ఆ దుండగులు ఆమెపై అత్యాచారాలు కొనసాగించారు. ఈ నెలలో వారి చెర నుంచి తప్పించుకున్న యువతి కుటుంబ సభ్యుల చెంతకు చేరి జరిగినదంతా వివరించింది. అనంతరం వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 11 మంది నిందితులపై కిడ్నాప్, రేప్, హింస కేసులు నమోదు చేశామని మీడియాకు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితులను ఇంకా అరెస్టు చేయలేదని అన్నారు.

More Telugu News