Lady: ఆన్ లైన్ పరిచయంతో మూడు గంటలు గడిపి బ్లాక్ మెయిల్... కిలేడీ ఆట కట్టించిన హైదరాబాద్ పోలీసులు!

  • యువకుడితో గడిపి రహస్య వీడియోలు
  • వాటిని చూపించి బెదిరింపులు
  • ట్రాప్ చేసి, అరెస్ట్ చేసిన పోలీసులు

ఆన్ లైన్ లో పరిచయమైన ఓ యువకుడిని లాడ్జికి రప్పించుకున్న మహిళ, ఆపై తన స్నేహితుడితో కలిసి అతన్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కాజేయగా, బాధితుడి ఫిర్యాదు మేరకు ఇద్దరినీ పోలీసులు కటకటాల వెనక్కు పంపించారు. హైదరాబాద్, కూకట్ పల్లి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, కావూరీ హిల్స్ ప్రాంతానికి చెందిన యువకుడికి, సోషల్ మీడియాలో 22 ఏళ్ల యువతి పరిచయమైంది. వీరిద్దరూ కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 14న కూకట్ పల్లి పరిధిలోని ఓ లాడ్జ్ లో మూడు గంటల పాటు సన్నిహితంగా గడిపారు. ఆ సమయంలో యువతి రహస్యంగా వీడియోలు తీసింది.

ఆపై తన స్నేహితుడు సంతోష్ (32) తో కలిసి యువకుడిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. తనకు డబ్బివ్వకుంటే తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని, తాము పోలీసులమని చెప్పి బెదిరించింది. దీంతో భయపడిన యువకుడు, రూ. 4. లక్షలు, ఐ ఫోన్ ఇచ్చాడు. ఆపైనా బెదిరింపులు రావడంతో, పోలీసులను ఆశ్రయించాడు. నిందితులను ట్రాప్ చేయాలన్న ఉద్దేశంతో, బాధితుడితో ఫోన్ చేయించిన పోలీసులు, డబ్బులిస్తామని చెప్పించి, వారిని ఫోరం సుజనా మాల్ వద్దకు రప్పించారు. ఆపై ఇద్దరినీ క్రైమ్ విభాగం పోలీసులు అరెస్ట్ చేసి, డబ్బును స్వాధీనం చేసుకుని, రిమాండ్ కు తరలించారు.

More Telugu News