ఎంతకైనా దిగజారుతున్న జగన్: నారా లోకేశ్
- ఎన్నార్సీపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు
- ఇప్పుడు కడపలో అమలు చేయబోమంటున్నారు
- ఓట్ల కోసం మడమ తిప్పే నేత జగన్
- ట్విట్టర్ లో లోకేశ్ విసుర్లు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓట్ల కోసం మడమ తిప్పే నాయకుడని, ఎంతకైనా దిగజారుతున్నారని మాజీ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టారు. "వైకాపా నాయకులు వారి అధ్యక్షుడు జగన్ గారే పెయిడ్ ఆర్టిస్ట్ అని గుర్తించడం మంచిది. పార్లమెంట్లో మద్దతు ఇస్తారు. అసెంబ్లీలో నోటిఫికేషన్లు ఇస్తారు. బయటమాత్రం మేము వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. 16 ఆగష్టు 2019న ఎన్ఆర్సీపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం" అని గెజిట్ ఫోటోను పోస్ట్ చేశారు. ఆపై "ఇప్పుడు కడప సభలో ఎన్ఆర్సీ అమలు చెయ్యమని ముఖ్యమంత్రిగారు చెప్తున్నారు. ఓట్ల కోసం మడమ తిప్పే నాయకుడు కదా, ఎంతకైనా దిగజారుతారు" అని అన్నారు.