Ration: షాకిస్తున్న జగన్ సర్కారు నిర్ణయాలు... కరెంట్ బిల్ 200 యూనిట్లు దాటితే రేషన్, 300 దాటితే పెన్షన్ కట్!

  • రేషన్, పెన్షన్ కార్డులను తగ్గించాలన్న ఉద్దేశం
  • బిల్లులపై ఆరా తీయనున్న గ్రామ వాలంటీర్లు
  • ఫోర్ వీలర్ ఉన్నా రేషన్ కట్
  • అద్దింట్లో ఉన్నవారు కరెంట్ వాడితే, యజమానిపై ప్రభావం

ఏపీలో రేషన్, పెన్షన్ కార్డుల విషయంలో జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు షాకిచ్చేలా ఉన్నాయి. కొత్త రేషన్, పెన్షన్ కార్డుల మంజూరు దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం వీటికి, కరెంట్ బిల్లులతో లింక్ లు పెడుతోంది. కరెంట్ బిల్ 200 యూనిట్లు దాటితే, రేషన్, 300 యూనిట్లు దాటితే పెన్షన్ ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరి బిల్ ఎంత వస్తుందన్న విషయాన్ని గ్రామ వాలంటీర్లు ఆరా తీసి, ఉన్నతాధికారులకు చేరవేస్తుంటారు.

ఇక వేరే వాళ్లకు ఇళ్లను అద్దెకిచ్చే వారిపై తొలి వేటు పడుతుందని తెలుస్తోంది. ఒక ఇంటిని అద్దెకు ఇచ్చే స్థాయిలో ఉన్న వారికి రేషన్, పెన్షన్ ఎందుకన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. భార్యా, భర్తల ఇద్దరి పేరుతో ఉన్న ఆధార్ కార్డుకు అనుసంధానమైన అన్ని సర్వీసులు ఒక యూనిట్ గా పరిగణించాలని అధికారులు నిర్ణయించారు. దీని ప్రకారం, ఇల్లు అమ్ముకుని, కరెంట్ మీటర్లలో పేర్లను మార్చుకోని వారు, ఇంటిని అద్దెకిచ్చి, మరో చోట ఉంటున్న వారికి ఇబ్బందులు తప్పవని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు.

ఇక ఏదైనా ఇంట్లో అద్దెకు ఉండి, ఎక్కువ కరెంట్ ఉపయోగిస్తే, ఆ భారం ఇంటి యజమానిపై పడుతుంది. ఇక టాక్సీ, ట్రాక్టర్, ఆటోలు మినహా మరే ఫోర్ వీలర్ ఉన్నా కూడా వారికి రేషన్ ఇవ్వరాదని కూడా అధికారులు నిర్ణయించారు. ఈ విషయంలో అతి త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.

More Telugu News