Amaravathi: అమరావతిలో ఉద్రిక్తత... జీఎన్ రావు కమిటీ సభ్యులను అడ్డుకునేందుకు యత్నించిన రైతులు

  • సీఎంకు నివేదిక సమర్పించిన జీఎన్ రావు కమిటీ
  • రాజధానిపై అధ్యయనం కోసం కమిటీ
  • నాలుగు ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సూచన
  • భగ్గుమన్న రాజధాని రైతులు

ఏపీ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ సీఎం జగన్ కు నివేదిక సమర్పించింది. ఈ కమిటీ తమ నివేదికలో చేసిన సిఫారసుల పట్ల రాజధాని ప్రాంత రైతులు భగ్గుమంటున్నారు. కమిటీ నివేదికగా వ్యతిరేకంగా మందడం వై జంక్షన్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. వెలగపూడిలో ఉన్న సచివాలయం వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా రాజధాని అధ్యయన కమిటీ సభ్యులను అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కమిటీ సభ్యులను వేరే మార్గంలో పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఈ దశలో రైతులు రోడ్డుకు బుల్ డోజర్ ను అడ్డంగా పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పురుషులు రోడ్డుపై పడుకోగా, మహిళలు తీవ్ర ఆగ్రహంతో ప్రభుత్వానికి, జీఎన్ రావు కమిటీకి శాపనార్థాలు పెట్టారు. ఈ ధర్నాలో పలువురు చిన్నారులు సైతం పాల్గొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జీఎన్ రావు కమిటీ ప్రజల అభిప్రాయాలను ఎప్పుడు తెలుసుకుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. అసలు, రాజధానిపై అధ్యయనం చేయడానికి జీఎన్ రావు కమిటీకి ఉన్న చట్టబద్ధత ఏంటని వారు నిలదీశారు.

More Telugu News