Vizag: వైజాగ్ వన్డేలో సెంచరీలు బాదిన రోహిత్, రాహుల్... తొలి బంతికే కోహ్లీ అవుట్

  • వైజాగ్ లో వన్డే మ్యాచ్
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
  • ధాటిగా ఆడిన టీమిండియా ఓపెనర్లు

విశాఖపట్నం వేదికగా టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో  ఓపెనర్లు అమోఘంగా ఆడారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ (102) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ పోటాపోటీగా ఆడడంతో స్కోరుబోర్డు నిర్విరామంగా పరుగులు తీసింది.

 ఈ క్రమంలో రోహిత్ మొదట సెంచరీ పూర్తిచేసుకోగా, ఆ తర్వాత రాహుల్ కూడా 100 మార్కు అధిగమించాడు. టీమిండియా ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు విండీస్ బౌలర్లు చేయని ప్రయత్నమంటూ లేదు. కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఆరుగురు బౌలర్లను ప్రయోగించినా సెంచరీలు చేయకుండా నిరోధించలేకపోయారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 37.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 232 పరుగులు. కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఆడిన తొలి బంతికే వెనుదిరగడంతో వైజాగ్ ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ (120) కు జతగా అయ్యర్ ఉన్నాడు.

More Telugu News