Aishwarya Rai: లాలుప్రసాద్ యాదవ్‌ భార్య రబ్రీదేవిపై కోడలు ఐశ్వర్య ఫిర్యాదు.. జుట్టు పట్టుకుని కొట్టారని ఆరోపణ

  • బాడీగార్డుల సాయంతో ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఫిర్యాదు
  • అత్త, ఆడపడుచులు తనకు తిండి కూడా పెట్టలేదని ఆరోపణ
  • రబ్రీ ఇంటికి ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు

బీహార్  మాజీ ముఖ్యమంత్రి, తన అత్త అయిన రబ్రీదేవిపై కోడలు, తేజ్‌ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యరాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తన జుట్టు పట్టుకుని కొట్టారని, బాడీగార్డుల సాయంతో ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐశ్వర్యరాయ్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.  

విషయం తెలిసిన ఐశ్వర్య తండ్రి, ఎమ్మెల్యే చంద్రికారాయ్ వెంటనే రబ్రీదేవి నివాసానికి చేరుకున్నారు. మరోవైపు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు రబ్రీదేవి నివాసానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఆమె ఇంటికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పంపినట్టు డీఎస్పీ రాకేశ్ ప్రభాకర్ తెలిపారు.

కాగా, ఐశ్వర్య ఇటువంటి ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. అత్తింటి బాడీగార్డులు తనను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని గతంలో ఆరోపించారు. అత్త రబ్రీదేవి, ఆడపడుచు మిసాభారతిలు తనకు భోజనం పెట్టకుండా వేధించారని తాజా ఫిర్యాదులో ఐశ్వర్య ఆరోపించారు. మరోవైపు, ఐశ్వర్యతో తనకు విడాకులు ఇప్పించాలంటూ గతేడాది నవంబరులో తేజ్‌ప్రతాప్ కోర్టును ఆశ్రయించారు.  

More Telugu News