Sabarimala: శబరిమల వెళ్లే మహిళలకు రక్షణ కల్పించాలన్న పిటిషన్లపై సుప్రీంలో విచారణ

  • గత తీర్పుపై స్టే లేదన్న సుప్రీం
  • ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టీకరణ
  • తదుపరి విచారణ వరకు పిటిషనర్లకు పోలీసు భద్రత

గత కొన్నాళ్లుగా శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే అనేకసార్లు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శబరిమల వెళ్లి స్వామిని దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించిన కొందరు మహిళలను ఆందోళనకారులు అడ్డుకున్న సంఘటనలు కూడా జరిగాయి. కాగా, శబరిమల వెళ్లే మహిళలకు రక్షణ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది.

ఫాతిమా, అమిని అనే మహిళలు దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ, రివ్యూ పిటిషన్లపై త్వరలోనే విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేస్తామని తెలిపింది. మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, గత తీర్పుపై స్టే లేనందున మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. దాంతో, సీజేఐ అందుకుని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, తదుపరి విచారణ వరకు పిటిషనర్లకు పోలీసు భద్రత కల్పించాలని సుప్రీం ఆదేశించింది.

ఇంతకుముందు, శబరిమలకు మహిళలు వెళ్లే అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అన్ని వయసుల మహిళలు శబరిమల వెళ్లొచ్చని స్పష్టం చేసింది.

More Telugu News