Andhra Pradesh: గౌరవ ప్రతిపక్ష నాయకుడు శ్రీశ్రీశ్రీ చంద్రబాబు గారు జరిగిన దానికి విచారం వ్యక్తం చేసే పరిస్థితుల్లో లేరు: అంబటి సెటైర్లు

  • చంద్రబాబు సభలో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు
  • 10-15 ఏళ్ల బాలుడిలా ప్రవర్తిస్తున్నారు
  • శాసనసభలో వాడకూడని పదాలు వాడుతున్నారు
  • ఈ వయసులో ఆయన బూతులు నేర్చుకుంటున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని వైసీపీ సభ్యుడు అంబటి రాంబాబు విమర్శించారు. 'చంద్రబాబు 10-15 ఏళ్ల బాలుడిలా ప్రవర్తిస్తున్నారు. శాసనసభలో వాడకూడని పదాలు వాడుతున్నారు. ఈ వయసులో ఆయన బూతులు నేర్చుకుంటున్నారు. మీడియా సమక్షంలోనూ బూతులు మాట్లాడారు' అని అన్నారు.

'స్పీకర్ ఆదేశాలను అమలు చేస్తున్న మార్షల్స్ పైనే టీడీపీ సభ్యులు అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలు చేశారు. మార్షల్స్ ఇక్కడి భద్రతను కాపాడే క్రమంలో తండ్రీకొడుకులు ఇద్దరూ అనుచితంగా ప్రవర్తించారు. తాను భయపడనని, 150 మంది వచ్చినా భయపడనని అంటున్నారు. టీడీపీ సభ్యులు తప్పు చేశారు.. దీనిపై విచారం వ్యక్తం చేయాలని వారిని కోరాం.

కానీ, విచారణ వ్యక్తం చేయకుండా ఏవేవో కథలు చెప్పడం సమంజసం కాదు. ఇప్పటికైనా గౌరవ ప్రతిపక్ష నాయకుడు శ్రీ శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జరిగిన దానికి విచారణ వ్యక్తం చేసే పరిస్థితుల్లో లేరు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందే. ఇక్కడ భద్రత కల్పిస్తోన్న ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. క్రమ శిక్షణారాహిత్యంగా వ్యవహరించారు' అని అంబటి రాంబాబు అన్నారు.

More Telugu News