Chandrababu: మందబలం ఉందని గర్వపడుతున్నారు.. బాగా కొవ్వెక్కింది: వైసీపీపై చంద్రబాబు ఆగ్రహం

  • విజయవాడలో చంద్రబాబు మీడియా సమావేశం
  • వైసీపీపై విమర్శలు
  • స్పీకర్ తీరును ప్రశ్నించిన చంద్రబాబు

అధికార పక్షం వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైసీపీపై విమర్శలు గుప్పించారు. మందబలం చూసుకుని గర్వం ప్రదర్శిస్తున్నారని, మెజారిటీ ఉన్నది ప్రజల్ని హింసించడానికి కాదని, ప్రజా జీవితాల్ని అస్తవ్యస్తం చేయడానికి కాదని హితవు పలికారు. అసెంబ్లీలో కొవ్వెక్కిన చందంగా ప్రవర్తిస్తున్నారని, ప్రజలంటే లెక్కలేనితనం అని మండిపడ్డారు.  ఆర్టీసీ చార్జీలను పెంచుతూ ఓ పిడుగులా ప్రజలపై వేశారని, కనీసం సభ పవిత్రతను దృష్టిలో పెట్టుకుని ఓ ప్రకటన కూడా చేయలేదని విమర్శించారు.

ఈ ఏడునెలల పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, కనీస గిట్టుబాటు ధరలు లేక పండించిన పంటను రోడ్డుపై పెట్టుకుని, రోజుకు రూ.500 ఇచ్చి కాపలాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చారని, వర్షం పడితే భయపడే పరిస్థితికి వచ్చారని తెలిపారు. సభలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, స్పీకర్ ప్రవర్తన చూస్తే ఎంతో నిర్లక్ష్యంగా ఉందని అన్నారు. ఆ చేతులు ఊపడం, కూర్చోమనడం, వెళ్లిపొమ్మనడం ఓ పద్ధతి లేని వ్యవహారం అంటూ తమ్మినేని సీతారాంపై విమర్శలు చేశారు. "ఇదేంటని నేను ప్రశ్నిస్తే పది మందికి మాట్లాడే అవకాశం ఇచ్చి నన్ను తిట్టించారు. చివర్లో అయినా నా వాదన వినిపిద్దామనుకుంటే అవకాశం ఇస్తానని చెప్పి, ఇవ్వకుండానే టీ బ్రేక్ ప్రకటించి లోపలికి వెళ్లిపోయారు" అంటూ మండిపడ్డారు.

More Telugu News