Jagan: ఆవిడ చంద్రబాబు గారి అత్తగారు... ఏ పదవీ మీరు ఇవ్వలేదు... మేమిచ్చాం: జగన్ దెప్పిపొడుపు

  • నామినేటెడ్ పదవుల పంపకాలపై చర్చ
  • దోచి పెట్టడమే జగన్ లక్ష్యమన్న టీడీపీ
  • కౌంటర్ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పదవుల పంపకాలపై చర్చ జరుగుతున్న వేళ, సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేటెడ్ పదవులన్నీ రెడ్లకు ఇచ్చారని, తమ వారికి దోచిపెట్టడమే జగన్ లక్ష్యమని విపక్ష తెలుగుదేశం ఆరోపించగా, జగన్ సమాధానం ఇచ్చారు. కాపు కార్పొరేషన్ ను జక్కంపూడి రాజాకు ఇచ్చామని, ఏపీఐఐసీని ఆర్కే రోజాకు ఇచ్చామని చెప్పారు.  నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చామని, సగం పదవుల్లో మహిళలే ఉన్నారని గుర్తు చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఇలా చేయలేకపోయిందని విమర్శలు గుప్పించారు.

"అధ్యక్షా... చంద్రశేఖర్ రెడ్డికి ఏపీ స్టేట్ మెడ్ అండ్ ఇన్ ఫ్రా డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధ్యక్షా... వెరీ రిప్యూటెడ్ డాక్టర్, చాలా పేరుగాంచిన డాక్టర్. శ్రీమతి లక్ష్మీ పార్వతి, చైర్ పర్సన్, ఏపీ తెలుగు అకాడమీ..(చంద్రబాబు వైపు చూపిస్తూ) వాళ్లగారి అత్త అధ్యక్షా... వాళ్లగారి అత్తగారే. మీ పార్టీ వ్యవస్థాపకుడు, ఆయనగారి భార్య, చంద్రబాబు గారికి అత్తగారు... మీరు ఇవ్వలేదు. మేము ఇచ్చాము" అని అన్నారు.

ఆపై మిగతా నామినేటెడ్ పోస్టుల్లో ఎవరెవరిని నియమించామన్న విషయాన్ని చెబుతూ, అన్ని వర్గాలకూ న్యాయం చేసేలా పదవులు ఇచ్చామని జగన్ వ్యాఖ్యానించారు. 13 డీసీసీబీ చైర్మన్ పదవుల్లో సగం ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు, బీసీలే ఉన్నారని, గతంలో మార్కెటింగ్ పదవులను సామాన్యులకు ఇచ్చిన దాఖలాలే లేవని విమర్శలు గుప్పించారు. వక్రీకరించి మాట్లాడటంలో చంద్రబాబును మించిన వారు లేరని నిప్పులు చెరిగారు.

More Telugu News