Siddipet District: వెంటాడిన ఎన్‌కౌంటర్ భయం.. ఉరేసుకున్న హంతకుడు!

  • నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై టర్పంటైన్ చల్లి నిప్పు
  • గత రెండు వారాలుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు
  • కొండగట్టు వద్ద చెట్టుకు ఉరి

భార్యాపిల్లలను దారుణంగా హతమార్చి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు ఎన్‌కౌంటర్ భయంతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తెలంగాణలోని సిద్దిపేటలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నెమలికొండకు చెందిన లక్ష్మీరాజ్యం (45), సిద్ధిపేట జిల్లాలోని ఖమ్మంపల్లికి చెందిన విమల భార్యాభర్తలు. పుష్కరకాలం క్రితం వీరికి వివాహం కాగా, పవిత్ర, జయ్‌పాల్‌ ఇద్దరు పిల్లలున్నారు. వివాహం జరిగిన కొన్నాళ్ల నుంచే లక్ష్మీరాజ్యం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అతడి బాధలు భరించలేని విమల గత మే నెలలో భర్తపై కేసు పెట్టింది. అయితే, కోర్టులో రాజీ కుదరడంతో సిద్దిపేటకు వచ్చి కాపురం పెట్టారు.

గత నెల 21న మరోమారు భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో విమల, ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి ఆమె పుట్టింట్లో వదిలిపెట్టి వచ్చాడు. మళ్లీ అదే రోజు అర్ధరాత్రి వారింటికి వెళ్లి తలుపులు బద్దలుగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం నిద్రిస్తున్న భార్యాపిల్లలపై టర్పంటైన్ చల్లి నిప్పుపెట్టి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విమల, కుమార్తె పవిత్ర, సోదరుడు జాన్‌రాజ్‌, ఆయన భార్య రాజేశ్వరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విమల సోదరి సునీత పరిస్థితి కూడా విషమంగా ఉంది. మరో గదిలో నిద్రిస్తుండడంతో కుమారుడు జయపాల్ ప్రాణాలతో బయటపడ్డాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలో కొండగట్టు వద్ద చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. గత రెండు వారాలుగా పరారీలో ఉన్న లక్ష్మీరాజ్యం దొరికితే పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తారన్న భయంతోనే ఉరేసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News