Sasikala: శశికళ ఇల్లు కూల్చివేతకు కార్పొరేషన్ నోటీసులు!

  • తంజావూరులో శశికళ ఇల్లు
  • నివాస యోగ్యానికి అనువుగా లేదని తేల్చిన అధికారులు
  • తక్షణం కూల్చివేయకుంటే తామే కూల్చేస్తామని హెచ్చరిక

తమిళనాడు, తంజావూరులోని శశికళ ఇంటిని కూల్చి వేయాలని కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ఇల్లు శిథిలావస్థకు చేరుకుందని, ఇది ఎప్పుడైనా కూలిపోతుందని, మీరే స్వయంగా కూల్చుకోకుంటే, తాము కూలుస్తామని అధికారులు ఇంటి గోడకు నోటీసులు అంటించారు. తంజావూరు కార్పొరేషన్ పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి.

కాగా, ప్రస్తుతం శశికళ, అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పేరిట చెన్నై, తంజావూరు తదితర ప్రాంతాల్లో సొంత ఇళ్లు ఉన్నాయి. తంజావూరులో ఉన్న ఈ ఇల్లు దాదాపు 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ఇంటిలో మనోహర్ అనే వ్యక్తి అద్దెకు ఉంటుండగా, గత నెలలో కార్పొరేషన్ అధికారులు, దాన్ని పరిశీలించి, నివాసయోగ్యానికి అనువుగా లేదని, వెంటనే కూల్చివేయాలని సూచించారు.

15 రోజుల్లోగా ప్రత్యామ్నాయం చూసుకుని, ఇల్లు ఖాళీ చేయాలని కార్పొరేషన్ కమిషనర్ జానకీ రవిచంద్రన్ ఈ నోటీసులు జారీ చేశారు. ఇల్లును ఖాళీ చేయకుంటే జరిగే పరిణామాలకు ఇంటి యజమానిదే బాధ్యతని హెచ్చరించారు.

More Telugu News