Sajjanar: దటీజ్ ఐపీఎస్ సజ్జనార్... నాడు స్వప్నిక, నేడు దిశ... ప్రజలు కోరుకున్నట్టుగానే ఎన్ కౌంటర్లు!

  • దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సజ్జనార్ పేరు
  • 2008లో వరంగల్ లో స్వప్నికపై యాసిడ్ దాడి
  • నాడు నిందితులను ఎన్ కౌంటర్ చేయించిన ఎస్పీ సజ్జనార్
  • నేడు దిశ నిందితులకు అదే శిక్ష

సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్... ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. సజ్జనార్ ఎంతో మంచి పని చేశారంటూ వేలాది ట్వీట్స్ వెల్లువెత్తుతున్నాయి. దిశ కేసును దర్యాఫ్తు చేస్తున్న ప్రత్యేక బృందానికి సజ్జనార్ స్వయంగా నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. నేటి ఎన్ కౌంటర్ నేపథ్యంలో గతంలో ఆయన వరంగల్ ఎస్పీగా పని చేస్తున్న వేళ జరిగిన మరో ఎన్ కౌంటర్ ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న వేళ... 2008, డిసెంబర్ 10న వరంగల్ లో స్వప్నికపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజీ నుంచి ఇంటికి వెళుతున్న స్పప్నిక, ఆమె స్నేహితురాలు ప్రణీతలపై శ్రీనివాస్ అనే వ్యక్తి యాసిడ్‌ తో దాడి చేశాడు. ఆ సమయంలో అతనికి మరో ఇద్దరు సహకరించారు. వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేయగా, జరిగిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.ఆపై ముగ్గురు నిందితులూ పోలీసుల నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. ఆ సమయంలో వరంగల్ ఎస్పీగా సజ్జనార్ ఉన్నారు. మానవ హక్కుల సంఘాలు ఆ ఎన్ కౌంటర్ బూటకమని గగ్గోలు పెట్టినా, ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేశారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వాళ్లకు భూమిపై బతికే అర్హత లేదని, నాటి సీఎం వైఎస్ నుంచి అందిన ఆదేశాలతోనే సజ్జనార్ ఎన్ కౌంటర్ కు అనుమతి ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.

ఇక గత వారం జరిగిన దిశ హత్యాచారం, దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆసేతు హిమాచలం నిరసనలతో అట్టుడికింది. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలన్న డిమాండ్ వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలో దిశను హత్య చేసిన చోట సీన్ రీకన్‌ స్ట్రక్షన్ నిమిత్తం నిందితులను విచారిస్తున్న వేళ, వారంతా పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నాడు స్వప్నిక, నేడు దిశ... ఈ రెండు ఘటనల్లోనూ సజ్జనార్ దే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు.

More Telugu News