ISRO: విక్రమ్ ల్యాండర్ జాడ ముందుగా గుర్తించింది మేమే: ఇస్రో చైర్మన్ కె.శివన్

  • మా సొంత ఆర్బిటర్ ల్యాండర్‌ను గుర్తించింది
  • ఇప్పటికే మా వెబ్ సైట్ లో ఫొటోలు ఉంచాం 
  • సెప్టెంబరు 7న చంద్రుడిని ఢీకొట్టిన విక్రమ్

చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి ధ్వంసమైన విక్రం ల్యాండర్ జాడను మూడు రోజుల తర్వాత తామే గుర్తించామని ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రకటించారు. కావాలంటే ఈ విషయాన్ని ఇస్రో వెబ్ సైట్లో చూడొచ్చని తెలిపారు. చంద్రుడి భూ ఉపరితలంపై ఉన్న ఖనిజాలు, నీటి జాడలు కనుక్కునేందుకు ఇస్రో చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా రోవర్ తో కూడిన విక్రమ్ ల్యాండర్‌ను ఈ ఏడాది జూలై 22న పంపిన విషయం తెలిసిందే.

 ప్రయోగం అంతా సాఫీగా జరిగి 48 రోజులపాటు ప్రయాణించి, ఆర్బిటర్ ల్యాండర్‌ను విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. ఆర్బిటర్ మెల్లగా దూరాన్ని తగ్గించుకుంటూ చంద్రుని ఉపరితలం వద్దకు వెళ్లింది. దీంతో సెప్టెంబరు 7న ల్యాండర్‌ను చంద్రుని ఉపరితలంపై దించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. సాఫ్ట్ ల్యాండింగ్ దశలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా ల్యాండర్ హార్డ్ లాండింగ్ జరిగి ధ్వంసమైన విషయం తెలిసిందే.

నిర్దేశిత ప్రాంతానికి 750 మీటర్ల దూరంలో ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని అతివేగంగా ఢీ కొట్టి ధ్వంసమయ్యిందని తాజాగా నాసా నిన్న ప్రకటించింది. షణ్ముగ సుబ్రమణియన్ అనే భారతీయ ఔత్సాహిక శాస్త్రవేత్త సహకారంతో వీటి శకలాలను తాము గుర్తించగలిగామని నాసా పేర్కొంది.

అయితే నాసా ప్రకటనను శివన్ ఖండించారు. వివరాలను ఇస్రో వెబ్ సైట్లో చూడాలని కోరారు. అయితే, నాసా ఉంచిన చిత్రాల్లో ముక్కలైన ల్యాండర్ చిత్రాలు స్పష్టంగా కనిపిస్తుండగా, ఇస్రో చిత్రాల్లో అటువంటి దేమీ లేదు. ల్యాండర్ ఢీకొట్టిన ప్రాంతాన్ని చిన్న చుక్కగా మాత్రమే చూపించారు. 

More Telugu News