chidambaram: ఇక ఈ దేశ ఆర్థిక వ్యవస్థను దేవుడే కాపాడాలి!: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం

  • జీడీపీ గణాంకాలు వ్యవస్థ వృద్ధికి సంకేతాలు కాదు
  • లోక్ సభలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే
  • తీవ్రంగా ఖండించిన మాజీ ఆర్థిక మంత్రి

భారత ఆర్థిక వ్యవస్థను కాపాడగలిగింది ఇక ఆ దేవుడు మాత్రమేనని ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. నిన్న లోక్ సభలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ప్రసంగిస్తూ, జీడీపీ గణాంకాలు ఇకపై దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపకరించవని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దిగుమతి సుంకాలను పెంచడం, పర్సనల్ ట్యాన్స్ తగ్గించడం వంటి నిర్ణయాలను ఇప్పటికే వ్యతిరేకించిన చిదంబరం, తాజాగా నిషికాంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

కాగా, ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం, జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ 4.5 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఇకపై జీడీపీ గణాంకాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన దూబే, 1934 కన్నా ముందు ఏ జీడీపీ గణాంకాలు ఉన్నాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో రిమాండ్ ఖైదీగా తీహార్ జైల్లో ఉన్న చిదంబరం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ, సంస్కరణల అమలు దిశగా బీజేపీ ఏమీ చేయడం లేదని విమర్శలు గుప్పించారు.

More Telugu News