musharraf: హృద్రోగ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ముషారఫ్

  • 2016లో చికిత్స కోసం దేశం విడిచిన ముషారఫ్
  • అప్పటి నుంచి దుబాయ్‌లోనే తిష్ట
  • దేశద్రోహం కేసులో ఎల్లుండి తీర్పు

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అనారోగ్యంతో దుబాయ్‌లోని ఆసుపత్రిలో చేరారు. గుండె సంబంధిత సమస్యలతోపాటు, రక్తపోటుతో ముషారఫ్ బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ 2016లో చికిత్స కోసం దుబాయ్ వచ్చిన ముషారఫ్.. ఆ తర్వాత స్వదేశం వెళ్లలేదు. ప్రస్తుతం ముషారఫ్‌పై పాక్‌లో దేశద్రోహం కేసు నమోదై ఉంది. ఈ కేసులో లాహోర్ హైకోర్టు ఎల్లుండి తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ముషారఫ్ ఆసుపత్రిలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

3 నవంబరు 2007లో ముషారఫ్ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారంటూ ముషారఫ్‌పై కేసు నమోదు కాగా, ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. ఈ కేసులో తమ ఎదుట హాజరుకావాలంటూ ముషారఫ్‌కు కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ ఆయన నుంచి స్పందన లేకపోవడంతో ఈ కేసును ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించింది. ముషారఫ్‌ను అరెస్ట్ చేయాలని ఆదేశించింది.

More Telugu News