Vijayawada: టీడీపీ హయాంలో పేదలకు ఇళ్లు ఇవ్వడానికి లంచాలు వసూలు చేశారు: ఏపీ మంత్రి వెల్లంపల్లి

  • విజయవాడలోని 49వ డివిజన్ లో వెల్లంపల్లి పర్యటన
  • మాజీ కార్పొరేటర్ ఆలు జయలక్ష్మిపై స్థానికుల ఆరోపణ
  • అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తాననని మంత్రి హామీ

తెలుగుదేశం పార్టీ హయాంలో పేదలకు ఇళ్లు ఇవ్వడానికి కూడా టీడీపీ నాయకులు లంచాలు వసూలు చేశారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. విజయవాడ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి 49వ డివిజన్ లో ఈరోజు ఆయన పర్యటించారు. డివిజన్ లోని కంసాలి పేట, తమ్మిన పోతరాజు వీధి, ఎర్రకట్ట డౌన్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ హయాంలో మాజీ కార్పొరేటర్ ఆలు జయలక్ష్మి పేదలకు నివాస గృహాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారని స్థానికులు ఆరోపిస్తూ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో వెల్లంపల్లి మాట్లాడుతూ, పేదల పట్ల టీడీపీ నాయకులకు ఉన్న చిత్తశుద్ధి ఇది! అంటూ ఎద్దేవా చేశారు. ఈ ఆరోపణలపై పోలీస్ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని బాధితులకు భరోసా కల్పించారు. ఆర్ అండ్ బి స్థలంలో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలోని పింఛన్ల పంపిణీ, రోడ్డు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.

More Telugu News