KCR: నాక్కొంచెం మొండితనం ఎక్కువ... మనోళ్లనే పిలిపించి మాట్లాడదామని అనుకున్నా: సీఎం కేసీఆర్

  • ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ఆత్మీయ సమావేశం
  • కార్మికులపై వరాల జల్లు
  • సమ్మె కాలానికి పూర్తి జీతం చెల్లింపు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రగతిభవన్ లో ఆర్టీసీ కార్మికులతో ప్రత్యేకంగా విందు సమావేశం నిర్వహించారు. ప్రతి డిపో నుంచి కొందరిని పిలిపించిన కేసీఆర్ వారికి భోజనం పెట్టించి ఆపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్వహణ ఆషామాషీ కాదని, అనేక విభాగాలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఓ ఇంట్లోనూ, బక్కగా ఉన్నవాడు, లావుగా ఉన్నవాడు, పాసైనోడు, ఫెయిలైనోడు ఇలా రకరకాలుగా ఉంటారని, మరి ప్రభుత్వం కూడా అలాంటిదేనని అన్నారు. అందరినీ పైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని పేర్కొన్నారు.

కానీ ఇటీవల పరిణామాల నేపథ్యంలో తాను చొరవ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. సాధారణంగా తనకు మొండితనం ఎక్కువని, అసలీ సమ్మె వ్యవహారం ఎందుకు ఓ కొలిక్కిరాదని పట్టుదలగా తీసుకుని కార్మికులను పిలిచానని వెల్లడించారు. మీ సంగతేంటని అధికారులను అడిగితే, ఒక్క అవకాశం ఇవ్వండి సార్, వంద శాతం మీ పేరు నిలబెడతామని చెప్పారని వివరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సంక్షోభం జరగనివ్వబోమని వారు హామీ ఇచ్చారని, తాను కూడా ఏమీ జరగదని గట్టినమ్మకంతోనే ఉన్నానని కేసీఆర్ పేర్కొన్నారు.

నేను పిలవడం, మీరు రావడం, ఇప్పుడీ సమావేశం అంతా సాఫీగా జరిగిపోయింది... సీఎం వద్దకు వెళ్లి ఏంతెచ్చారని మీ వాళ్లు అడిగితే సమ్మెకాలానికి పూర్తి జీతం తెచ్చామని చెప్పండంటూ కార్మికులపై వరాల జల్లు కురిపించారు. సమ్మె ఎన్నిరోజులు జరిగిందో అన్ని రోజులకు పూర్తి జీతం చెల్లిస్తామని, మొత్తం ఒకే దఫాలో ఇస్తామని అన్నారు. యూనియన్లు, ఇతర రాజకీయాల జోలికి వెళ్లకుండా కష్టపడి పనిచేస్తే సింగరేణి తరహాలో బోనస్ లు ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు.

More Telugu News