Spl.Item: కరెన్సీ నోట్లతో కుర్చీ... ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణ!

  • డాలర్ల కట్టలతో రూపకల్పన 
  • రష్యా రాజధాని మాస్కోలో ప్రత్యేక ఆకర్షణ
  • కొనాలంటే రూ.7.17 కోట్లు ఉండాల్సిందే

అభిరుచులు భిన్నంగా ఉంటాయి. ఒక్కొక్కరికీ ఒక్కో ఆలోచన ఉంటుంది. కొంతమంది ఒళ్లంతా బంగారం అన్నట్టు నగలతో నింపుకుంటారు. మరికొంతమంది వస్తువులు చేయించుకుంటారు. ఇంకొంతమంది వాహనాల బాడీకి ప్రాదాన్యం ఇస్తారు. అప్పుడెప్పుడో గాలి జనార్దనరెడ్డి బంగారు సింహాసనాన్ని తయారు చేయించుకుని ఇంట్లో పెట్టుకున్నాడని చదివాం. తాజాగా రష్యా రాజధాని మాస్కోలో నోట్ల కట్టలతో తయారు చేసిన కుర్చీ ప్రత్యేక ఆకర్షణీయంగా మారింది. అయితే ఈ కుర్చీని ఎవరూ తయారు చేయించుకోలేదు. ఔత్సాహికులే కుర్చీని తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. ఆసక్తి ఉన్న వారెవరైనా దీన్ని కొనుక్కోవచ్చని ఆఫర్ ఇచ్చారు.

అయితే ధర మామూలుగా లేదండోయ్! కుర్చీ సొంతం చేసుకోవాలంటే పది లక్షల డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో ఏడు కోట్ల 17 లక్షల రూపాయలు చెల్లించాలి మరి. అబ్బో...ఇంత ఖరీదా అనుకుంటున్నారా? గాజు పలకలతో ఫ్రేం తయారుచేసి వాటి మధ్య డాలర్ల కట్టలు ఉంచడం వల్లే ఇంత ఖరీదు. మరి ఈ కుర్చీని ఎవరు దక్కించుకుని దాచుకుంటారో చూడాలి.

More Telugu News