West Indies: వెస్టిండీస్ టీ20 సిరీస్ కు దూరమైన శిఖర్ ధావన్... టీమిండియా టీ20 జట్టు ఇదే!

  • డిసెంబర్ 6 నుంచి విండీస్ తో టీ20 సిరీస్ ప్రారంభం
  • గాయపడ్డ ధావన్ కు విశ్రాంతిని కల్పించిన సెలెక్టర్లు
  • వన్డే సిరీస్ కు అందుబాటులోకి రానున్న ధావన్

టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ వెస్టిండీస్ తో జరగనున్న టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. గాయంతో బాధపడుతున్న ధావన్ కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతని స్థానంలో యువ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ సంజు శాంసన్ కు అవకాశం కల్పించారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి ఇండియా-వెస్టిండీస్ మధ్య సిరీస్ ప్రారంభం కానుంది.

ఈ నెలలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 మ్యాచ్ లో ఢిల్లీ తరపున శిఖర్ ధావన్ ఆడాడు. ఈ సందర్భంగా క్యాచ్ కోసం డైవింగ్ చేసినప్పుడు ధావన్ ఎడమ మోకాలికి లోతైన గాయం తగిలింది. ధావన్ కు చికిత్స చేసిన వైద్యులు... అతనికి కొంత కాలం విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ నేపథ్యంలో ధావన్ కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. అయితే డిసెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కు ధావన్ జట్టులోకి రానున్నాడు.

టీ20 సిరీస్ కు టీమిండియా జట్టు ఇదే:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శివం దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, సంజు శాంసన్ (వికెట్ కీపర్).

More Telugu News