Chandrababu: జరుగుతున్న పరిణామాలతో ఎంతో బాధ పడుతున్నా: చంద్రబాబు

  • అమరావతిపై బొత్స వ్యాఖ్యలు క్షమించలేనివిగా ఉన్నాయి
  • అమరావతి అనే పేరును గౌరవించాలి
  • రాబోయే తరాలకు ఏమీ మిగలకుండా చేసేలా జగన్ పాలన కొనసాగుతోంది

ఏపీ రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చుతూ వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. బొత్స వ్యాఖ్యలు భయంకరంగా, క్షమించలేనివిగా ఉన్నాయని అన్నారు. రాజధానిపై మీకు గౌరవం లేకపోయినా... అమరావతి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతుల సెంటిమెంట్ నైనా గౌరవించాలని చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.

గతించిపోయిన ఒక గొప్ప నాగరికత నుంచి అమరావతి అనే పేరును తీసుకున్నామని... ఆ పేరును గౌరవించాలని చంద్రబాబు అన్నారు. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న 5 కోట్ల తెలుగు ప్రజల గుర్తింపును, ఆకాంక్షలను గౌరవించాలని సూచించారు.

జరుగుతున్న పరిణామాలతో తాను ఎంతో కలత చెందుతున్నానని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గతంతో పాటు భవిష్యత్తును కూడా తుడిచిపెట్టే విధంగా... రానున్న తరాలకు ఏమీ మిగలకుండా చేసేలా జగన్ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. జగన్ వారసత్వం ఇదేనని దుయ్యబట్టారు.

More Telugu News