Mahabubabad District: మహబూబాబాద్‌లో బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన పాఠశాల బస్సు.. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్

  • ప్రమాద సమయంలో బస్సులో 35 మంది విద్యార్థులు
  • స్వల్ప గాయాలతో బయటపడిన విద్యార్థులు
  • తీవ్రంగా మరో నలుగురు

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఓ స్కూలు బస్సు అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యార్థులు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. స్కూలు బస్సు డ్రైవర్ సహా నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబాబాద్‌కు చెందిన మహర్షి పాఠశాల బస్సు 35 మంది విద్యార్థులతో కంబాలపల్లె వెళ్తుండగా గ్రామ శివారులో ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న గేదెలను తప్పించబోయి బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బొలెరో బోల్తాపడింది.

బస్సు ముందు భాగం నుజ్జైంది. డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకుపోయాడు. అయితే, బస్సు బోల్తాపడకపోవడంతో  పెను ప్రమాదం తప్పింది. క్యాబిన్‌లో చిక్కుకుపోయిన డ్రైవర్‌తోపాటు బొలెరో వాహనంలో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News