India-Bangladesh Day/Night test Match: చేతులెత్తేస్తున్న బంగ్లా బ్యాట్స్ మెన్.. మరో విజయానికి దగ్గరలో భారత్!

  • రెండో ఇన్నింగ్స్ రెండోరోజు ఆటలో 152/6
  • ఇంకా 89 పరుగుల ట్రయల్స్ లో ఆతిథ్య జట్టు
  • ఇశాంత్ కు 4, ఉమేశ్ కు 2 వికెట్లు

ఈడెన్ గార్డెన్ వేదికగా కొనసాగుతున్న డే/నైట్ టెస్ట్ లో కోహ్లీసేన దుమ్ము రేపుతోంది. రెండో రోజు ఆటలో బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్ లోనూ భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లా 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీం 59 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన మహ్మదుల్లా (39 పరుగులు) రేపు తిరిగి బ్యాటింగ్ కు దిగే అవకాశముంది. ఇప్పటికి భారత్ కన్నా బంగ్లా ఇంకా 89 పరుగులు వెనుకబడి ఉంది.

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 174/3 పరుగులతో ఆటను కొనసాగించిన భారత్, తొలి ఇన్నింగ్స్ ను 9 వికెట్ల నష్టానికి 347 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ కోహ్లీ డే/నైట్ టెస్ట్ చరిత్రలో భారత తరపున సెంచరీ చేసిన తొలి క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. కాగా, పుజారా, అజింక్య రహానేలు అర్ధ శతకాలతో రాణించారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా బ్యాట్స్ మెన్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా పేసర్ ఇషాంత్ శర్మ వేగవంతమైన బంతులతో బంగ్లా బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. మొత్తం 39 పరుగులిచ్చి నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకోగా, మరో పేసర్ ఉమేష్ యాదవ్ 40 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు.

More Telugu News