BJP: టికెట్ ఇవ్వలేదనే బీజేపీపై తిరుగుబాటు.. గెలిపిస్తే మళ్లీ అందులోకే!: కర్ణాటక బీజేపీ రెబల్ అభ్యర్థి

  • వచ్చే నెల 5న కర్ణాటకలో ఉప ఎన్నికలు
  • విజయనగర నుంచి బరిలోకి కవిరాజ అరసు
  • ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించిన బీజేపీ

ఉప ఎన్నికలో తనను గెలిపిస్తే మళ్లీ బీజేపీలోనే చేరుతానని కర్ణాటక బీజేపీ రెబల్ అభ్యర్థి కవిరాజ అరస్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే నెల 5న రాష్ట్రంలోని 15 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫిరాయింపుల కారణంగా ఖాళీ అయిన స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయనగర్ నుంచి కవిరాజ అరస్ పోటీ చేస్తున్నారు. బీజేపీ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ రెబల్‌గా బరిలోకి దిగుతున్నారు.

తాజాగా, ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు బంపరాఫర్ ఇచ్చారు. బీజేపీ తనకు టికెట్ ఇవ్వకపోవడం వల్లే రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే తిరిగి బీజేపీ తీర్థం పుచ్చుకుంటానని పేర్కొన్నారు. పార్టీపై తిరుబాటు చేసిన అరసును బీజేపీ గురువారం ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించింది.

More Telugu News