Husband murdered by wife: భర్తను చంపి వంట గదిలో పాతిపెట్టిన భార్య!

  • ఎప్పటిలాగా వంటచేసుకుంటూ జీవనం
  • కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు
  • దర్యాప్తులో మృతుడి జాడ కనిపెట్టిన పోలీసులు

భర్తను చంపి వంటగదిలో పాతిపెట్టి, ఎప్పటిలాగే అదేచోట వంటచేసుకుంటూ జీవిస్తున్న మహిళను మధ్యప్రదేశ్ పోలీసులు నాటకీయ ఫక్కీలో అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అనుప్పూర్ జిల్లాలోని కరోండి గ్రామానికి చెందిన న్యాయవాది 35ఏళ్ల మహేష్ బన్వాల్ గతనెల 22 నుంచి కనిపించకుండా పోయాడని అతని భార్య ప్రమీల ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలో.. మృతుడి తమ్ముడు అర్జున్ బన్వాల్ తన అన్న మరణంపై అనుమానాలున్నాయని తెలిపాడు.

ఈ నేపథ్యంలో ప్రమీల ఇంటిని తనిఖీ చేస్తున్న సమయంలో, వంటగదిలోంచి దుర్వాసన రావడంతో అనుమానంతో అక్కడ తవ్విచూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహేశ్ శవాన్ని గుర్తించి వెలికి తీశామన్నారు. అనంతరం ప్రమీలను తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకుందని తెలిపారు. మహేశ్ పెద్దన్న గంగారం బన్వాల్ ఈ హత్య చేయడానికి తనకు సహాయం చేశాడని నిందితురాలు పేర్కొందన్నారు. గంగారం భార్యతో మహేశ్ కు అక్రమ సంబంధం ఉందని, ఈ నేపథ్యంలో మహేశ్ హత్యకు అతనితో కలసి పథకం వేసి, అమలు చేశానని ప్రమీల చెప్పిందన్నారు. ప్రమీలను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News