Bangladesh: చారిత్రాత్మక డేనైట్ టెస్టు మ్యాచ్‌ చూసేందుకు కోల్ కతా చేరుకున్న బంగ్లా ప్రధాని షేక్ హసీనా

  • కాసేపట్లో డే/నైట్ టెస్టు ప్రారంభం 
  • అభినవ్‌ బింద్రా, మేరీకోమ్,  పీవీ సింధు హాజరయ్యే అవకాశం
  • సందడి చేయనున్న టీమిండియా మాజీ క్రికెటర్లు

భారత్-బంగ్లాదేశ్ మధ్య  కాసేపట్లో డే/నైట్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ చూసేందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కోల్ కతా చేరుకున్నారు. ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆమె ఈడెన్ గార్డెన్స్ చేరుకున్నారు.

ఈ మ్యాచ్ చూసేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రానున్నారు. అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ మ్యాచ్ ప్రారంభానికి వచ్చే అవకాశం ఉంది. ఈడెన్‌ గార్డెన్‌లో నేటి నుంచి ఈ నెల 26 వరకు ఈ మ్యాచ్‌ జరగనుంది. కాసేపట్లో టాస్ వేయనున్నారు.

పశ్చిమ బెంగాల్ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాబ్‌) ప్రధాని మోదీని కూడా ఈ మ్యాచ్ కు ఆహ్వానించింది. రాజకీయ ప్రముఖులతో పాటు  షూటర్‌ అభినవ్‌ బింద్రా, బాక్సర్‌ మేరీకోమ్, షట్లర్‌ పీవీ సింధు కూడా హాజరుకానున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్లు కూడా స్టేడియంలో సందడి చేయనున్నారు.

More Telugu News