Buggana: ఆయనే ఇలా మాట్లాడితే.. రాష్ట్ర భవిష్యత్ ఏమిటి?: ఆలపాటి రాజా

  • అమరావతిని అడుగడుగునా నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు
  • ప్రజల ఆకాంక్షలు, రైతుల త్యాగాలు ప్రభుత్వానికి పట్టడం లేదు
  • దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు

తమ ప్రభుత్వానికి అమరావతి నిర్మాణం ప్రాధాన్యత కాదని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా తప్పుబట్టారు. ఆర్థిక మంత్రే ఇలా మాట్లాడితే... రాష్ట్ర భవిష్యత్ ఏమిటని ప్రశ్నించారు. బుగ్గన వ్యాఖ్యలు జగన్ పాలనకు అద్దం పడుతున్నాయని విమర్శించారు. అమరావతిని అడుగడుగునా నిర్వీర్యం చేయాలనుకుంటున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షలు, రైతుల త్యాగాలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని చెప్పారు.

రాజధానికి అన్యాయం చేస్తే రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టేనని ఆలపాటి అన్నారు. చంద్రబాబుకు పేరు రాకూడదనే ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని వీరు ఎలా పాలించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని చెప్పారు.

విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై సమీక్షలను కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆలపాటి అన్నారు. విదేశాంగ శాఖను సైతం ఈ రొంపిలోకి దించి... దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు.

More Telugu News