G.Kishan Reddy: కశ్మీర్‌లో ఇప్పుడు రాళ్లు విసరడం వంటి అల్లర్లు తగ్గాయి: కేంద్ర హోంశాఖ

  • ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ ప్రశాంతం
  • రాళ్లు విసిరే ఘటనలు గణనీయంగా తగ్గాయి
  • సభకు వెల్లడించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం ఏర్పడిందని కేంద్ర హోంశాఖ తెలిపింది. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పోలీసులపైకి రాళ్లు విసరడం వంటి ఘటనలతోపాటు అల్లర్లు కూడా తగ్గాయని తెలిపారు.

ఈ ఏడాది ఆగస్టు నుంచి నవంబరు 15 వరకు ఇటువంటి కేసులు 190 నమోదయ్యాయని సభకు తెలిపిన మంత్రి.. ఇందుకు సంబంధించి 765 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు అంటే ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 4 మధ్య 361 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన ఘటనల్లో ఇప్పటి వరకు 18 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అలాగే, గత ఆరు నెలల్లో జమ్మూకశ్మీర్‌ను 34,10,219 మంది పర్యాటకులు సందర్శించారని, వీరిలో 12,934 మంది విదేశీయులని మంత్రి కిషన్‌రెడ్డి సభకు తెలిపారు.

More Telugu News