Air India: మార్చిలోగా ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం సంస్థల విక్రయం: నిర్మలా సీతారామన్

  • క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అనుసరించి తుది నిర్ణయం
  • ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం నుంచి పూర్తిగా వైదొలగనున్న కేంద్రం
  • ఇప్పటికే ప్రాథమిక అనుమతులు మంజూరు

పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలను వచ్చే సంవత్సరం మార్చిలోగా విక్రయిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఎయిర్ ఇండియా ప్రస్తుతం రూ. 58 వేల కోట్ల అప్పుల్లో ఉందని ఆమె తెలిపారు. "రెండు కంపెనీల విక్రయం ఈ ఆర్థిక సంవత్సరమే పూర్తి చేయాలని భావిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అనుసరించి తుది నిర్ణయం ఉంటుంది" అని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నిర్మల వ్యాఖ్యానించారు.

కాగా, ఈ నెలారంభంలో ఎయిర్ ఇండియా ఉద్యోగులకు బహిరంగ లేఖను రాసిన సంస్థ చైర్మన్ అశ్వని లోహానీ, ప్రభుత్వ వాటాల ఉపసంహరణ తరువాత సంస్థ నిలదొక్కుకుంటుందన్న భరోసాను ఇచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన నిర్మలా సీతారామన్, ఎయిర్ ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిని చూపుతున్నారని అన్నారు.

ఇటీవల నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఎయిర్ ఇండియా సహా, పలు కంపెనీల్లో డిజిన్వెస్ట్ మెంట్ కు సూత్రప్రాయ అంగీకారాన్ని తెలిపిన విషయం విదితమే. ఆసక్తిగల సంస్థల నుంచి లేఖలను కోరుతూ ఓ ప్రకటన కూడా విడుదలైంది. ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాలను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 100 శాతం వాటా ప్రభుత్వం వద్దే ఉండగా, గత సంవత్సరం సంస్థ విక్రయానికి ప్రయత్నించిన కేంద్రం విఫలమైంది. అప్పట్లో ఒక్క సంస్థ కూడా బిడ్ ను దాఖలు చేయలేదు. ప్రభుత్వ వాటా కొనసాగే పక్షంలో సంస్థను టేకోవర్ చేసేందుకు ఏ సంస్థ కూడా ముందుకు రాకపోవచ్చని సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ ఓ నివేదికలో తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా రూ. 4,600 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థ నిర్వహణా లాభాలను నమోదు చేసే స్థితికి వస్తుందని భావించినా, అది వాస్తవ రూపం దాల్చలేదు. ఎయిర్ ఇండియాను పూర్తిగా విక్రయించేందుకు కేంద్రం సిద్ధపడటంతో, విదేశీ ఎయిర్ లైన్ సంస్థలు కొనుగోలుకు ముందుకు వస్తాయని అంచనా.

ఇక భారత్ పెట్రోలియం విషయానికి వస్తే, సంస్థలో ప్రస్తుతం 53.29 శాతం వాటా ప్రభుత్వానిదే. రూ. 1.02 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ తో ఉన్న సంస్థలో వాటాల విక్రయం ద్వారా రూ. 65 వేల కోట్లను ఖజానాకు చేర్చాలని కేంద్రం భావిస్తోంది.

More Telugu News