Bhavya Reddy: 10 రోజుల చికిత్సకు రూ. 12 లక్షలు ఖర్చు చేసినా... టెక్కీని కబళించిన డెంగీ!

  • ఇంజనీరింగ్ చదువుతున్న భవ్యా రెడ్డి
  • ఇటీవలే ఇన్ఫోసిస్ లో ఉద్యోగం
  • డెంగీ సోకి చికిత్స పొందుతూ మృతి

ఉన్నత చదువులు చదువుకుంది. రెండు నెలల క్రితమే మంచి వేతనానికి సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ లో ఉద్యోగాన్ని సాధించింది. తమ కలలు నిజమయ్యాయని, ఆమెను చూసి గర్వించారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఓ దోమకాటు, ఆపై వచ్చిన డెంగీ వ్యాధి, ఆమె ప్రాణాలను హరించింది. తమ బిడ్డను బతికించుకోవాలన్న తాపత్రయంతో 10 రోజుల్లో రూ. 12 లక్షలు ఖర్చు చేసినా, ప్రాణాలు దక్కక పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళితే, మెదక్ జిల్లా హవేళి ఘణపూర్ మండలానికి చెందిన భవ్యారెడ్డి (21), నరేందర్ రెడ్డి, మంజలు దంపతుల కుమార్తె. ప్రస్తుతం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆమె, క్యాంపస్ సెలక్షన్స్ లో ప్రతిభ చూపి, ఇన్ఫోసిస్ లో ఉద్యోగాన్ని సంపాదించింది.

పది రోజుల క్రితం ఆమెకు జ్వరం రావడంతో, తొలుత స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి, పరిస్థితి విషమించడంతో, హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తల్లిదండ్రులు తరలించారు. ఆమెకు డెంగీ సోకిందని వైద్యులు తేల్చారు. ప్లేట్ లెట్స్ సంఖ్య 40 వేలకు పడిపోయిందని చెప్పారు. ఆమెకు చికిత్స చేయించేందుకు తల్లిదండ్రులు వెనుకాడలేదు. జ్వరం, బీపీ బాగా పెరిగిపోగా, వైద్యులు వెంటిలేటర్ అమర్చారు. రెండు రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన భవ్య, కన్నుమూసింది.

More Telugu News