Jagan: జనసేన నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.. మీ కుటుంబంపై చేస్తే తట్టుకోగలరా?: చంద్రబాబు

  • జనసేన నాయకుడు ఇసుక లాంగ్ మార్చ్ చేశారు
  • ఆయనపై విమర్శలు చేస్తున్నారు
  • ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేస్తే మీరు తట్టుకోగలుగుతారా? 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి ముగ్గురు భార్యలని, వారి పిల్లలు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారా? అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ నేతలు ప్రత్యర్థిపార్టీ నేతలను తిట్టడానికి వినియోగించే సమయాన్ని ఇసుక సమస్యను తీర్చడానికి వినియోగించాలని హితవు పలికారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక సమస్యపై చంద్రబాబు ఈ రోజు విజయవాడలోని ధర్నాచౌక్‌లో దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'జనసేన నాయకుడు ఇసుక లాంగ్ మార్చ్ చేస్తే ఆయనపై విమర్శలు చేస్తున్నారు.. వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నేను అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తిగత విమర్శలు మీపై చేస్తే మీరు తట్టుకోగలుగుతారా? మీ కుటుంబం గురించి ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకోగలరా?

ఆంబోతుల మాదిరిగా తయారవుతున్నారు మీరు. ఓ ఎమ్మెల్యే విర్రవీగిపోతున్నాడు. మా నేతలను తిడుతున్నాడు. ఫర్వాలేదు.. నేను అడుగుతున్నాను.. మమ్మల్ని తిట్టే సమయాన్ని ఉపయోగించుకొని ఇసుక సమస్య తీర్చండి, లేదంటే రాష్ట్రానికి క్షమాపణ చెప్పాల్సి అవసరం ఉంది' అని వ్యాఖ్యానించారు.

More Telugu News