Devi Sri Prasad: దేవిశ్రీ ప్రసాద్ పై 'సామజ వర గమనా...' ప్రెజర్!

  • అల్లు అర్జున్ హీరోగా 'అల వైకుంఠపురములో'
  • ఇప్పటికే రెండు పాటలు సూపర్ హిట్
  • వాటికి మించేలా కంపోజ్ చేసేందుకు శ్రమిస్తున్న డీఎస్పీ

ఎస్ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహించగా, అల్లు అర్జున్ తాజా చిత్రం 'అల వైకుంఠపురములో' సినిమాకు సంబంధించిన రెండు పాటలు ఇప్పుడు హాట్ ట్రెండింగ్ గా మారాయన్న సంగతి తెలిసిందే. 'సామజ వర గమనా...' అంటూ థమన్ ఇచ్చిన ట్యూన్ సూపర్ హిట్ కాగా, 7.7 కోట్ల వ్యూస్ తెచ్చుకుని, ఈ సంవత్సరం బెస్ట్ మెలోడీగా నిలిచింది. ఇదే సమయంలో 'రాములో రాములా...' అంటూ సాగే పాట మాస్ ను మెప్పించి 4 కోట్లకు పైగా వ్యూస్ తెచ్చుకుంది.

ఇప్పుడదే మరో స్టార్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ పై ఒత్తిడిని పెంచింది. మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి డీఎస్పీ స్వరాలు సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. 'అల వైకుంఠపురములో', 'సరిలేరు నీకెవ్వరు' రెండు చిత్రాలూ ఈ సంక్రాంతికి విడుదల కానున్నాయి. దీంతో ఈ రెండు పాటలకన్నా మెరుగ్గా ఉండేలా పాటలను ఇవ్వాలని చిత్ర యూనిట్ దేవిశ్రీ ప్రసాద్ ను కోరిందట.

దీంతో ఆ ఒత్తిడితో నిద్రలేని రాత్రులు గడుపుతున్న డీఎస్పీ, ఇప్పటికే ఓ సూపర్బ్ ట్యూన్ ను సిద్ధం చేశారని, దీని రికార్డింగ్ పూర్తి కాగానే, ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక చివరకు ఏ పాటలు హిట్ అవుతాయో, ఏవి రికార్డులను తిరగరాస్తాయో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు. 

More Telugu News