Tamil Nadu: ఇప్పుడే వస్తానని బయటకెళ్లిన వరుడు.. రాకపోవడంతో ఆగిన పెళ్లి!

  • తమిళనాడులోని చెన్నైలో ఘటన
  • అదృశ్యమైన వరుడి కోసం పోలీసుల గాలింపు
  • ఫోన్ స్విచ్చాఫ్

మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, వరుడు అదృశ్యమైన ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్లిన వరుడు ఎంతకీ రాకపోవడంతో వివాహం కాస్తా ఆగిపోయింది. పోలీసుల కథనం ప్రకారం.. మీనంబాక్కంకు చెందిన సుకుమారన్ (34) చెన్నై విమానాశ్రయంలోని కార్గో విభాగంలో పనిచేస్తున్నాడు. స్థానిక రాయపేటకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. నిన్న ఉదయం పల్లవరంలోని కల్యాణమండపంలో వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు సోమవారం సాయంత్రమే కల్యాణ మండపానికి చేరుకున్నారు.

బయట చిన్న పని ఉందని, చూసుకుని ఇప్పుడే వచ్చేస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లిన సుకుమారన్ గంటలు గడుస్తున్నా రాకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తుండడంతో అతడి కోసం గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెళ్లి కొడుకు కోసం గాలిస్తున్నారు.

More Telugu News