APPSC: గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన ఏపీపీఎస్సీ

  • ఫిబ్రవరి 4 నుంచి 16 మధ్య పరీక్షల నిర్వహణ
  • మార్చి17,18,19 తేదీల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగ నియామకాల రాత పరీక్ష
  • మార్చి19,20 తేదీల్లో డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్స్ సవరించిన పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ ఆర్ ఆంజనేయులు వెల్లడించారు. మెయిన్స్ పరీక్షలు ఫిబ్రవరి 4 నుంచి 16వరకు జరుగుతాయన్నారు. నిజానికి ఈ పరీక్షలు డిసెంబర్ 12 నుంచి 16వరకు జరగాల్సి ఉందని, అయితే ప్రిలిమ్స్ ఫలితాల విడుదల జరిగిన జాప్యం కారణంగా తమకు మెయిన్స్ కు సన్నద్ధం కావడానికి సమయం సరిపోదని పరీక్షల తేదీని వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారన్నారు.

 ఈ నేపథ్యంలో వారి వినతిని మన్నించి పరీక్ష తేదీలను మార్చినట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 4న తెలుగు, 5న ఇంగ్లీష్, 7న పేపర్-1, 10న పేపర్-2, 12న పేపర్-3, 14న పేపర్-4, 16న పేపర్-5 పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కాగా, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగ నియామకాల రాత పరీక్ష మార్చి 17,18,19 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. కాగా, డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షలను మార్చి 19, 20 తేదీల్లో చేపట్టాలని నిర్ణయించినట్లు ఆంజనేయులు పేర్కొన్నారు.

More Telugu News