Cricket: ఇండోర్ స్టేడియంలో పింక్ బాల్ తో భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్

  • ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నక్రికెటర్లు
  • సహయం చేస్తామన్న స్టేడియం మాజీ కార్యదర్శి మిలింద్ కన్మాడికర్
  • ఈడెన్ గార్డెన్స్ లో 22న ప్రారంభం కానున్న డే అండ్ నైట్ టెస్ట్

భారత క్రికెట్ జట్టు తొలిసారిగా డే అండ్ నైట్ టెస్టు ఆడటానికి సన్నద్ధమవుతోంది. భారత్ లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ లో పాల్గొంటోంది. ఈ నెల 22న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్ట్ మ్యాచ్ లో పింక్ బాల్ తో భారత జట్టు ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కోహ్లీసేన పింక్ బాల్ తో ప్రాక్టీస్ చేసేందుకు సహకరించాలని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఎంపీసీఏ)ను అభ్యర్థించింది. ఆ రాష్ట్రంలోని ఇండోర్ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల కింద  పింక్ బాల్ తో ప్రాక్టీస్ చేయడానికి సహాయం చేయాలని కోరింది.

దీనిపై ఎంపీసీఏ మాజీ కార్యదర్శి మిలింద్ కన్మాడికర్ సానుకూలంగా స్పందించారు. ఆటగాళ్లు పింక్ బాల్ కు అలవాటు పడేందుకు ఫ్లడ్ లైట్ల కింద ప్రాక్టీస్ చేసుకునేందుకు తమ వంతు సహాయం చేస్తామని తెలిపారు. ఈ మేరకు వివరాలను ఆయన మీడియాకు తెలిపారు. ‘భారత క్రికెట్ జట్టు పింక్ బాల్ తో ప్రాక్టీస్ చేయడానికి మమ్మల్ని సంప్రదించింది. మేం ఒప్పుకున్నాం. వారికి తగిన ఏర్పాట్లు చేయబోతున్నాం’ అని చెప్పారు. కాగా, రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు ఈ నెల 14న ఇండోర్ లో ప్రారంభం కానుంది.

More Telugu News