Chittoor District: 478 మందిని విచారించినా లభించని వర్షిత హంతకుని ఆచూకీ!

  • కల్యాణ మండపం వద్ద వర్షిత కిడ్నాప్
  • హత్యాచారం చేసిన కామాంధుడు
  • ఆరు టీమ్ లతో నిందితుని కోసం గాలింపు

చిత్తూరు జిల్లా చేనేత నగర్ లోని కల్యాణ మండపం వద్ద పెళ్లికని వచ్చి, ఓ కామాంధుడి చేతికి చిక్కి హత్యాచారానికి గురైన చిన్నారి వర్షిత ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ కేసును సీరియస్ గా తీసుకుని నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని స్వయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా పోలీసులను ఆదేశించారు.

ఈ కేసులో నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ఓ అనుమానితుని చిత్రాన్ని కూడా గీయించారు. పాపను తీసుకుని వెళుతున్న అనుమానితుడి దృశ్యాలు కల్యాణ మంపడం వద్ద మినహా మరెక్కడా నమోదు కాలేదు. ఈ కేసు విచారణలో భాగంగా ఇంతవరకూ పోలీసులు 478 మందిని విచారించినా, సరైన ఆధారాలు లభించలేదు. మొత్తం ఆరు టీమ్ లను ఏర్పాటు చేసిన పోలీసులు, హంతకుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

ఇక కేసులో నిందితుడి ఊహా చిత్రాన్ని పోలిన యువకుడు పెద్ద తిప్ప సముద్రం మండలంలో ఉన్నాడని పోలీసులకు సమాచారం అందడంతో, అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. ఈ కేసుతో అతనికి సంబంధం లేదని తెలుసుకుని, ఆపై విడిచిపెట్టారు. నిందితుడు పాపకు పరిచయం ఉన్న వ్యక్తేనని భావిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. సాధ్యమైనంత త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు.

More Telugu News