Switzerland: స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతీయుల డబ్బు... వారసులు తీసుకోవచ్చంటూ ప్రకటన!

  • ఖాతాదారుల వారసులు ఆధారాలతో రావాలి
  • లేకుంటే ప్రభుత్వ ఖాతాలోకి రూ. 300 కోట్లు
  • జాబితాలో 12 భారత ఖాతాలు

అదంతా 12 మంది భారతీయుల డబ్బు. కష్టపడి సంపాదించారో, లేక అక్రమంగా కూడబెట్టారో... తీసుకెళ్లి స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నారు. ఎందుకనో వారు ఆ డబ్బును ఏళ్ల క్రితం డిపాజిట్ చేసి, ఇంతవరకూ తాకలేదు. ఆ మొత్తం ఇప్పుడు దాదాపు రూ. 300 కోట్లకు పైగానే ఉంది.

స్విస్ బ్యాంకుల్లో నిద్రాణంగా ఉన్న ఖాతాలను ఆ దేశ ప్రభుత్వం లెక్క తీసింది. మొత్తం 2,600 ఖాతాల్లో ఎన్నాళ్లుగానో ఎటువంటి ట్రాన్సాక్షన్సూ జరగలేదు. అందులో 12 ఇండియన్స్ వే. వాటిల్లో 4. కోట్ల స్విస్ ఫ్రాంక్స్ డబ్బుంది. ఇది 2015 నాటి లెక్క. ఇప్పుడా మొత్తం మరింతగా పెరిగిపోయి వుంటుంది.

ఇక, స్విస్ నిబంధనల ప్రకారం, 60 సంవత్సరాల పాటు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకుంటే, వారి వారసులు వచ్చి, ఆధారాలు చూపించి, ఆ డబ్బు తీసుకోవచ్చు. లేకుంటే అదంతా స్విస్ ప్రభుత్వ ఖాతాలోకి చేరిపోతుంది. అందుకే స్విస్ ఇప్పుడు ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. తమ దేశంలోని బ్యాంకుల్లో ఉన్న ఖాతాల్లోని డబ్బు వివరాలను గురించి తెలుపుతూ, వారి వారసులమేనని ఆధారాలతో వచ్చి డబ్బు తీసుకెళ్లాలని స్విట్జర్లాండ్ కోరింది.

ఇక ఈ ఖాతాల్లో రెండేసి చొప్పున కోల్ కతా, ముంబై నగరాలకు చెందిన వారివి, ఒకటి డెహ్రాడూన్ కు చెందిన వ్యక్తిదని తెలుస్తోంది. కొన్ని ఖాతాలు మాజీ సంస్థానాదీశులవని, బ్రిటీషర్ల కాలంలోనే బ్రిటన్, ఫ్రాన్స్ లో స్థిరపడిపోయిన వారి ఖాతాలు కొన్ని ఉన్నాయని సమాచారం.

వీరి వారసులంతా ఈ నెల 15లోగా తమ వివరాలను బ్యాంకుకు అందించాల్సి వుంటుంది. ఖాతాదారుల వారసులం తామేనని నిరూపించుకోలేక పోతే, ఆ డబ్బంతా స్విస్ సర్కారు ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఇదిలావుండగా, కొన్ని ఖాతాదారుల పేర్లు కూడా తెలుస్తున్నాయి. చంద్రలత, ప్రాణ్ లాల్ పటేల్, మోహన్ లాల్, కిశోర్ లాల్, రోజ్ మేరే బెర్నెట్, పీరే వాచ్ వంటి భారతీయుల ఖాతాలు ప్రస్తుతం నిద్రాణంలో ఉన్నాయి. వీరి వారసులు ఆధారాలతో రావాలని స్విస్ కోరుతోంది.

More Telugu News