national herald: అయోధ్య తీర్పుపై వివాదాస్పద వ్యాసం ప్రచురించిన నేషనల్ హెరాల్డ్.. క్షమాపణ చెప్పి తొలగించిన వైనం

  • ఆకార్ పటేల్ రాసిన వ్యాసాన్ని ప్రచురించిన నేషనల్ హెరాల్డ్
  • విమర్శలతో విరుచుకుపడిన బీజేపీ
  • వెబ్‌సైట్ నుంచి వ్యాసాన్ని తొలగించి.. క్షమాపణ చెప్పిన పత్రిక

‘అయోధ్యలో హిందూ భక్తుడు ప్రార్థన ఎందుకు చేయకూడదు?’ శీర్షికతో వివాదాస్పద వ్యాసం ప్రచురించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక క్షమాపణలు తెలిపింది. ఆకార్ పటేల్ రాసిన ఈ వ్యాసం విమర్శలకు కారణమైంది. వీహెచ్‌పీ, బీజేపీ కోరుకున్నట్టుగానే సుప్రీం తీర్పు చెప్పిందని ఆకార్ పటేల్ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ హయాంలో ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు, దీనికి పెద్దగా తేడా ఏమీ లేదని ఆయన రాసుకొచ్చారు.

కాంగ్రెస్ అధికార పత్రిక అయిన నేషనల్ హెరాల్డ్ ప్రచురించిన ఈ వ్యాసంపై బీజేపీ భగ్గుమంది. భారత న్యాయవ్యవస్థను పాకిస్థాన్‌తో పోల్చడం సిగ్గుచేటని  బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

వెల్లువెత్తుతున్న విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అయిన నేషనల్ హెరాల్డ్ వెంటనే ఆ వ్యాసాన్ని తమ వెబ్‌సైట్ నుంచి తొలగించింది. ఈ వ్యాసం వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని వేడుకుంది. అది పత్రిక అభిప్రాయం కాదని, వ్యాసకర్త అభిప్రాయం మాత్రమేనని వివరణ ఇచ్చింది. సుప్రీం తీర్పును తాము గౌరవిస్తున్నట్టు స్పష్టం చేసింది.

More Telugu News