Hyderabad: హైదరాబాద్ లో విషాదం... ఫంక్షన్ హాల్ గోడకూలి నలుగురి దుర్మరణం

  • అంబర్ పేటలో కుప్పకూలిన ఫంక్షన్ హాల్ గోడ
  • మృతుల్లో ఒకరు మహిళ
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఫంక్షన్ హాల్ గోడకూలిపోయిన ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. అంబర్ పేట్ గోల్నాకలో ఉన్న పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఈ ఘోరం జరిగింది. లోపల ఓ వివాహం జరుగుతున్న సమయంలో గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో కృష్ణయ్య, సొహెయిల్, సురేశ్, విజయలక్ష్మి మరణించగా, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, మృతుల కుటుంబాలకు జీహెచ్ఎంసీ రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

కాగా, ఈ ఘటనలో పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఇటీవలే పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ కు మరమ్మతులు నిర్వహించగా, ఇవాళే పునఃప్రారంభమైంది. అంతలోనే ప్రమాదం జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై విచారణ జరిపించాలని ఆదేశించారు.

More Telugu News