Hyderabad: విమానం ఆలస్యం...శంషాబాద్‌లో ఆందోళనకు దిగిన ప్రయాణికులు

  • రీ షెడ్యూల్‌ చేసిన ఎయిరిండియా యాజమాన్యం
  • ఉదయం 6.10 గంటలకు బయలుదేరాలి
  • మధ్యాహ్నం 3 గంటలకు సమయం మార్పు

విమానాన్ని దాదాపు తొమ్మిది గంటలు ఆలస్యంగా నడుపుతూ ఎయిరిండియా యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అనివార్య కారణాలవల్ల ఆలస్యమైతే గంటో రెండు గంటలో ఉంటుందని, ఏకంగా ఉదయం విమానాన్ని సాయంత్రం నడపడమేంటంటూ మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి ఈరోజు ఉదయం 6.10 గంటలకు ఓ ఎయిరిండియా విమానం బయలుదేరాల్సి ఉంది.

ఎప్పటిలాగే సమయానికి ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్నారు. తీరా వచ్చాక విమానాన్ని మధ్యాహ్నం 3 గంటలకు రీషెడ్యూల్‌ చేసినట్టు ఎయిరిండియా సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యారు. దీంతో ముందస్తు సమాచారం లేకుండా ఇదేం తీరంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ కారణంగా విమానాశ్రయంలో కాసేపు గందరగోళం నెలకొంది.

More Telugu News