private bus: కొనుగోలు చేసి వారం కూడా గడవకముందే.. దగ్ధమైన ప్రైవేటు బస్సు

  • హైదరాబాద్, కూకట్‌పల్లిలో ఘటన
  • రూ.15 లక్షలతో బస్సు కొనుగోలు చేసిన వెంకట్రావు
  • తనపై ఎవరో కక్షతోనే ఈ పనిచేసి ఉంటారని ఆవేదన

కొనుగోలు చేసి వారం రోజులు కూడా కాకముందే ఓ ప్రైవేటు బస్సు మంటల్లో కాలి బూడిదైంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగిందీ ఘటన. ప్రశాంత్‌నగర్‌కు చెందిన వెంకట్రావు ఇటీవల రూ.15 లక్షలతో ఓ బస్సును కొనుగోలు చేశాడు. ఈ బస్సుకు కొన్ని మరమ్మతులు చేయించాల్సి ఉండడంతోపాటు ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ వంటివి కూడా పూర్తిచేయాల్సి ఉంది. దీంతో బస్సును ఓ ఖాళీ స్థలంలో పార్క్ చేసిన వెంకట్రావు ఆ పనులపై తిరుగుతున్నాడు.

నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో బస్సు నుంచి పొగలు వస్తుండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకునే సరికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. తనపై కక్షతో ఎవరో కావాలనే ఈ పనిచేసి ఉంటారని వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News