Ayodhya: అయోధ్య వివాదంలో సుప్రీంను ప్రభావితం చేసిన నివేదిక ఇదే!

  • అయోధ్య వివాదంపై సుప్రీం తీర్పు
  • కీలకంగా మారిన పురావస్తు శాఖ నివేదిక
  • బాబ్రీ మసీదు కంటే ముందే అక్కడో నిర్మాణం ఉందని తేల్చిన పురావస్తు శాఖ

గత మూడు దశాబ్దాలుగా రగులుతున్న అయోధ్య వివాదాస్పద భూమి వ్యవహారానికి సుప్రీం కోర్టు అంతిమతీర్పుతో తెరపడింది. ఈ భూమి హిందువులదేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, సుప్రీం కోర్టు రోజుల తరబడి విన్న వాదనలు, అభిప్రాయాల కంటే ఓ నివేదిక ఈ తీర్పులో కీలకపాత్ర పోషించింది.

అయోధ్యలో ఉన్న వివాదాస్పద స్థలంలో వాస్తవంగా ఉన్న నిర్మాణాలు ఏమిటి? అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తీవ్రస్థాయిలో పరిశోధించింది. అనేక తవ్వకాలు కూడా నిర్వహించింది. అక్కడ ఉన్న బాబ్రీ మసీదును ఖాళీ స్థలంలో కట్టలేదని, భూమిలో కూరుకుపోయిన ఓ కట్టడంపైన నిర్మించారని నివేదిక రూపొందించింది. ఆ నివేదికే సుప్రీం తీర్పు మరింత విస్పష్టంగా వచ్చేందుకు దోహదపడింది.

బాబ్రీమసీదును కట్టింది ఓ నిర్మాణంపైన అని, అంటే బాబ్రీ మసీదు కంటే ముందే అక్కడ ఓ నిర్మాణం ఉండేదని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని సుప్రీం కోర్టు బలంగా నమ్మింది. భూమిలో మరుగున పడిపోయిన ఆ నిర్మాణం ముస్లింలకు చెందినది మాత్రం కాదని, అది 12వ శతాబ్దానికి చెందిన నిర్మాణం అని ఏఎస్ఐ స్పష్టం చేసింది. అయితే అందుబాటులో ఉన్న ఆధారాలతో అది ఏ మందిరం అనేది చెప్పలేమని తన నివేదికలో వెల్లడించింది.

తన తీర్పు సందర్భంగా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ, భారత పురావస్తు శాఖను సందేహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సరిగ్గా చెప్పాలంటే పురావస్తు శాఖ నివేదిక సారాంశాన్నే ప్రధాన ఆధారంగా పరిగణించినట్టు అర్థమవుతోంది.

More Telugu News